ప్రపంచ ఛాంపియన్, భారత్కు చెందిన దొమ్మరాజు గుకేశ్ నార్వే చెస్ టోర్నీలో చరిత్ర సృష్టించాడు. క్లాసికల్ చెస్ పోటీలో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించాడు. తన కెరీర్లో క్లాసికల్ చెస్ పోటీలో కార్ల్సన్ను ఓడించడం గుకేశ్కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ పోటీలో తొలి రౌండ్లో కార్ల్సన్ చేతిలో గుకేశ్ ఓటమిపాలయ్యాడు. కానీ తాజా ఫలితంతో రివేంజ్ తీర్చుకున్నాడు.
నార్వే చెస్ టోర్నీలో భాగంగా ఆరో రౌండ్లో తెల్లపావులతో బరిలోకి దిగాడు దొమ్మరాజు గుకేశ్. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా వ్యూహాలు రచించాడు. తనదైన మార్క్ గేమ్తో ప్రపంచ నంబర్ వన్కు షాక్ ఇచ్చాడు. కార్ల్సన్ చేసిన తప్పిదాన్ని ఒడిసిపట్టుకున్న ప్రపంచ నంబర్ 3 గుకేశ్.. అద్భుతం చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ పోటీలో కార్ల్సన్.. చాలా సేపు గుకేశ్పై ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ తొలుత రక్షణాత్మకంగా ఆడిన భారత స్టార్.. ఆ తర్వాత ప్రపంచ నంబర్ వన్ను బోల్తా కొట్టించాడు.
కాగా నార్వే గ్రాండ్మాస్టర్పై క్లాసికల్ గేమ్లో గుకేశ్ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక కార్లసన్పై విజయం సాధించిన రెండో భారతీయ ప్లేయర్గా 19 ఏళ్ల గుకేశ్ నిలిచాడు. అంతకుముందు ప్రజ్ఞానంద చేతిలో కార్ల్సన్ ఓటమి చవిచూశాడు.
గుకేశ్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయాడు కార్ల్సన్. ఓడిపోయానని అర్థం అయ్యాక.. పిడికిలితో ఒక్కసారిగా చెస్బోర్డు టేబుల్ను గట్టిగా కొట్టాడు. దీంతో చెస్ వుడెన్ పీస్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాసేపటికే తేరుకున్న కార్లసన్ మళ్లీ టేబుల్పై పావులను అమర్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత గుకేశ్కు సారీ చెప్పి.. చకచకా నడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ పోటీ తర్వాత మాట్లాడిన గుకేశ్.. తన గెలుపు రేర్ ఫీట్ అని వ్యాఖ్యానించాడు. కార్ల్సన్తో ఆడినపుడు 100కు 99 సార్లు ఓడిపోయే అవకాశం ఉందని, కానీ లక్కీగా ఆ మ్యాచ్ను గెలిచినట్లు గుకేశ్ తెలిపాడు. ఓటమి పాలైన సందర్భాల్లో తాను కూడా చెస్బోర్డ్ టేబుల్ను చాలా సార్లు కొట్టాటని ఈ సందర్భంగా అతడు గుర్తు చేసుకున్నాడు. ఇక గుకేశ్ విజయం పట్ల ప్రధాని మోదీ, ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర సంతోషం వ్యక్తం చేశారు. గుకేశ్ను కొనియాడారు.