గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని లాంచ్ చేశారు. భారత కాలమానం ప్రకారం శనివారం (మే10) సాయంత్రం చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వెలసిన తన మైనపు విగ్రహంతో కలిసి రామ్ చరణ్ ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చెర్రీతో పాటుగా ఆయన పెట్ డాగ్ రైమ్ విగహాన్ని కూడా ఏర్పాటు చేసారు. టుస్సాడ్స్ చరిత్రలోనే పెంపుడు కుక్కతో ఓ సెలబ్రిటీ వాక్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. చరణ్ - రైమ్ ఇద్దరూ తమ మైనపు బొమ్మల పక్కన సోఫాలో కూర్చొని ఫోటోలు దిగడం అందరినీ ఆకట్టుకుంటోంది.
మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు ప్రతిమ ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన వచ్చినప్పుడు.. రామ్ చరణ్ తనతో పాటుగా తన పెట్ డాగ్ రైమ్ బొమ్మని కూడా పెట్టాలని షరతు పెట్టారట. దానికి వాళ్ళు ఒకే అనడంతో ఇద్దరూ కలిసి కొలతలు ఇచ్చారు. అలా రైమ్ కు కూడా టుస్సాడ్స్ లో చోటు కల్పించారు. విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా రైమ్ తన మైనపు బొమ్మని చూసి కాసేపు గందరగోళానికి గురైంది. ఆ తర్వాత సోఫా ఎక్కి చరణ్ పక్కన కూర్చుంది.
రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారని తెలుస్తోంది. ఈ నెల 19 నుండి సింగపూర్లోని మ్యూజియంలో ప్రదర్శనకు అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకు రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాలను మాత్రమే మేడమ్ టుస్సాడ్స్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ లిస్టులో చేరాడు.